చాణుక్యుని పద్మవ్యూహంలో చిక్కిన కన్నా...!!!

Saturday, April 25, 2020 09:23 AM Politics
చాణుక్యుని పద్మవ్యూహంలో చిక్కిన కన్నా...!!!

"రాజకీయాల్లో హత్యలుండవు..ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి". పొలిటిక్స్‌లో తరచుగా వినిపించే  మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాట కన్నా లక్ష్మీనారాయణకు బాగా సరిపోతుంది. రాజకీయాల్లో అవకాశాలను వెతుక్కోవాలి..అవకాశవాదాలుగా మారకూడదు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో అవకాశాలు వెతుకున్నంత కాలం బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అవకాశవాదిగా మారిపోయారో అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం ఆయనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసి పోవడం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాపు  కాంగ్రెస్‌ నాయకుడిగా కన్నాకు ఓ మంచి గుర్తింపు ఉండేది. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తన నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కన్నాకు పేరుండేది. కాని..వైఎస్‌ఆర్‌ మరణానంతరం  మారిన రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో కన్నా పూర్తిగా విఫలమయ్యారు.
కన్నానే కాదు చాలా మంది నేతలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని తక్కువుగా అంచనా వేసి కనుమరుగయ్యారు. రాజకీయ జీవితాలను సమాధి చేసుకున్నారు. కన్నా రాజకీయ జీవితం కూడా త్వరలో సమాధి కాబోతుంది. రామోజీతో కన్నా భేటీ అయిన రోజు నుంచే కన్నా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారని అర్ధమై పోయింది. ఏ రోజైతే కన్నా రామోజీతో  భేటీ అయ్యారో ఆ రోజు నుంచే కన్నా రాజకీయ జీవితం పతనం ప్రారంభమైందని నేను ఆనాడే ఓ ఆర్టికల్ రాశాను. వీరిద్దరి భేటీ వెనుక చంద్రబాబు, ఆయన మనుషుల వ్యూహరచన కూడా ఉందని చెప్పాను. ఏ రోజైతే కన్నా రామోజీని కలిశారో ఆ రోజు నుంచే కన్నా పొలిటికల్ లైన్‌ మారిపోయింది. చంద్రబాబు వాయిస్సే కన్నా నోటి నుంచి రావడం ప్రారంభమైంది. ఎల్లో మీడియా వార్తలే కన్నాకు కళ్లకు నిజాలుగా కనిపించడం ఆరంభమైంది. కన్నా ట్విటర్ పాస్‌ వర్డ్ టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చేశాడా అన్నట్లుగా ట్విటర్ పిట్ట కూతలు మారిపోయాయి. కన్నా లక్ష్మీ నారాయణ ఓ రాజకీయ అజ్ఞాని, అవకాశవాది అని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన వ్యూహకర్తలు ఎప్పుడో గుర్తించారు.వైఎస్‌ఆర్‌ సీపీలో చేరడానికి అని బయల్దేరి ఢిల్లీ కాల్‌తో గుండె పోటు అంటూ ఆస్పత్రిలో చేరినప్పుడే కన్నాను వైఎస్‌ఆర్‌ సీపీ లైట్ తీసుకుంది. తరువాత బీజేపీలో చేరిన కన్నా..అనతికాలంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు.  అయితే..వైఎస్‌ఆర్‌ సీపీ పెద్దలు కన్నా మాటలు, విమర్శలు,  వ్యవహారశైలిపై దృష్టి పెట్టారు. ఓ మాట అనే ముందు కచ్చితమైన సాక్ష్యాధారాలుంటేనే బయట మాట్లాడాలి. ఆ రోజు కోసం వైఎస్‌ఆర్ సీపీ ఎదురు చూసింది. కన్నా స్థాయికి మించి విమర్శలు చేయడాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. కరోనా  సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండకుండా చంద్రబాబు వాయిస్‌ వినిపించడంపై వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహకర్తలు మౌనంగా భరించారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయిన లక్ష కిట్లపై ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చేలా మాట్లాడటాన్ని వైఎస్‌ఆర్ సీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అంతే..కన్నా నిజస్వరూపాన్ని బయటపెట్టాలని వైఎస్ఆర్‌ సీపీ వ్యూహకర్తలు భావించారు. అంతే..విశాఖలో ప్రెస్‌ మీట్ పెట్టి కన్నా రాజకీయ జీవితాన్ని ఓ దెబ్బకే సున్నా చేశారు  వైఎస్‌ఆర్ సీపీ చాణుక్యుడు విజయసాయి రెడ్డి.

వేణుంబాక విజయసాయి రెడ్డి. ఈయన చార్టెట్ అకౌంటెంట్ అయినప్పటికీ పొలిటికల్ లెక్కలు బాగా తెలిసినవారు.  వైఎస్‌ఆర్‌  కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మహానేత వైఎస్‌ఆర్‌ మరణించినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌తోనే ఉంటున్నారు. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి నమ్మిన బంటు.
వైఎస్‌ఆర్‌ సీపీలో ట్రబుల్ షూటర్‌. తన చాణక్యంతో శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు.  ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. ప్రధాని మోదీ దగ్గరకు డైరక్ట్‌గా వెళ్లగలిగే వాళ్లలో విజయసాయి రెడ్డి ఒకరు.
తన చాణక్యంతో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకుంటూ  ఉంటారు. అటువంటిది వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అ ప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు వాయిస్‌ను వినిపిస్తున్న కన్నాను వదిలి పెడతారు అనుకోవడం పొరపాటు. ఈ చాణుక్యుడు కన్నాపై ఓ కన్నేసే ఉంచారు. కన్నా హద్దులు దాటి విమర్శలు చేస్తుండటంతో ఇక క్షమించకూడదని నిర్ణయానికి వచ్చారు. అంతే..చంద్రబాబుకు కన్నా అమ్ముడు పోయిన విషయాన్ని బయటపెట్టారు.  చంద్రబాబుకు కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని మీడియా సాక్షిగా చెప్పారు.  డీల్ కుదిర్చింది బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్ట్ సుజనా చౌదరి అంటూ కుండబద్దలు కొట్టారు. అంతే...విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనతో కన్నాకు నిజంగా గుండె పోటు  రావడం ప్రారంభమైంది. విజయసాయి రెడ్డి ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేస్తారు.ప్రత్యర్థి కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ పడేలా వ్యూహ రచన ఉంటుంది. కన్నా విషయంలో కూడా తన చాణిక్యాన్ని విజయసాయి రెడ్డి ప్రదర్శించారు. ఓ పక్క చంద్రబాబుతో కన్నాకు సుజనా చౌదరి కుదిర్చిన డీల్‌ను బయటపెడుతూనే ఢిల్లీలోని బీజేపీ నేతల దృష్టికి  కన్నా ప్రభుత్వంపై  చేస్తున్న విమర్శలు తీసుకెళ్లారు.
అంతే...బీజేపీ అధిష్టానం కన్నాపై ఫైర్ అయింది. విమర్శలు చేసే ముందు ...ఆ విమర్శలను తమకు పంపాలని ఆదేశించింది. తాము ఆమోదిస్తేనే  విమర్శలు చేయాలని  హెచ్చరించింది.  నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కన్నాకు నడ్డా చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాదు...మీ పోస్ట్ కూడా త్వరలోనే పోతుందనే సంకేతాలు కన్నాకు అధిష్టానం పంపిందని ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే కన్నా పోస్ట్ పోయేదని తెలుస్తోంది. అంతేకాదు..2019 సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం పంపిన రూ.30 కోట్లకు కూడా కన్నా సున్నం రాశారనే సమాచారం బీజేపీ పెద్దల దగ్గర ఉంది.  ఈ విషయంలో కూడా బీజేపీ పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ తలంటినట్లు ఢిల్లీ సమాచారం. ఇన్ని మోసాలు, తప్పులు చేసిన కన్నా తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడానికి కాణిపాకం ఆలయాన్ని వాడుకోవాలని చూస్తే ఆ దేవుడు  క్షమించడు. కన్నాపై విమర్శల విషయంలో టీడీపీ నుంచి బాబు బీజేపీలోకి పంపిన నేతలు మాత్రమే విమర్శలు చేస్తున్నారు తప్పితే నిజమైన బీజేపీ నేతలు ఎవరూ కూడా విజయసాయి రెడ్డిపై పల్లెత్తు మాట అనడం లేదు. కన్నాకు రక్షణ కవచంగా బాబు  బీజేపీలో ఉన్న తన బంటులను పెట్టారు. ఈ విషయం స్పష్టం. విజయసాయిపై బీజేపీలోని బాబు  బంటులు మాత్రమే విమర్శలు చేస్తుండటాన్ని మనం గుర్తించాలి. అయితే...ఈ గొడవ జరుగుతుండగానే బీజేపీ  అగ్రనేతల్లో ఒకరైన రామ్ మాధవ్ సాక్షి పేర్‌లో మోదీ గురించి అద్భుతమైన ఆర్టికల్ రాశారు. దీని ద్వారా తమ మద్దతు ఎవరికో ఆయన స్పష్టమైన సంకేతాలు ఏపీ బీజేపీ నేతలకు పంపించారు. ఇక్కడ విజయసాయి రెడ్డి చాణక్యం చూస్తే ఔర అనిపిస్తోంది. 1. కన్నా రూ.20 కోట్లు తీసుకుని బాబుకు అమ్ముడుపోయాడని చెప్పడం. 2. ఈ డీల్‌ను బీజేపీలో బాబు కోవర్ట్ సుజనా చౌదరినే చేశాడని బీజేపీ నేతలకు తెలియజేయడం 3. చంద్రబాబు ముసుగులో కన్నా విమర్శలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం 4. ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం పంపిన రూ.30 కోట్లు కన్నా నొక్కేయడం.5. ఢిల్లీలో చక్రం తిప్పి కన్నా పోస్ట్‌ను ఊడేలా చేయడం 6.  ఏపీ  బీజేపీలో చాలా వరకు చంద్రబాబు మనుషులు ఉన్నారని బీజేపీ అధిష్టానానికి తెలియజేయడం. 7. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సీఎంగా తొలగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో తాను సీఎం కావడానికి ఢిల్లీలో ఓ కాంగ్రెస్‌ పెద్దకు రూ.20 కోట్లు కన్నా ఇచ్చిన విషయాన్ని బయట పెట్టారు.  ఇవన్నీ కూడా కన్నా బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌ను ప్రజలకు చెప్పడానికే. కన్నా మీద విజయసాయి రెడ్డి మాటల దాడి వెనుక ఇంత వ్యూహం దాగి ఉంది. విజయసాయి రెడ్డి తన చాణక్యంతో కన్నా నిజస్వరూపాన్నే కాదు  బాబు, ఆయన బినామీ సుజనా చౌదరి, ఏపీ బీజేపీలో ఉన్న చంద్రబాబు మనుషుల వీరిందరీ వ్యవహారాన్ని ఢిల్లీ బీజేపీ నేతలకు తెలియజేయగలిగారు. అందుకే..విజయసాయి రెడ్డిని నేను పొలిటికల్ లెక్కలు తెలిసిన చాణుక్యుడు అంటాను.

రాజకీయాల్లో ఓర్పు, సహనం, సమయం చూసుకుని ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలి. చాణుక్యుడు విజయసాయి రెడ్డి ఇదే చేశారు. బాబుకు అమ్ముడుపోయిన తరువాత కన్నా తప్పు మీద తప్పు చేసేలా ఎదురుచూశారు. కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన సమయంలో కూడా కన్నా ఎల్లో వాయిస్‌ వినిపించడాన్ని సమయంగా తీసుకుని అస్త్రాలు సంధించారు. కన్నా వ్యవహారశైలిపై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యేలా వ్యూహం రచించారు. మరోవైపు...అంబటి వంటి కాపు నేతలు ద్వారా కన్నాపై మాటల దాడి చేయించారు. ఎక్కడా కూడా కన్నా, బాబు గ్యాంగ్ గుక్క తిప్పుకోకుండా విజయసాయి రెడ్డి చాణిక్యం నెరిపారు. కన్నా రాజకీయ జీవితాన్ని సున్నా చేశారు. నాకు తెలిసి కన్నా రాజకీయ జీవితం ముగిసినట్లే. "తనను చంపడానికి చంద్రబాబు మనుషులను పంపారు" అని కన్నా గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో చెప్పారు. అలా తనను చంపడానికి  ప్రయత్నించిన బాబుతోనే కన్నా కలిసిపోయారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత  మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెబుతారు. కన్నా తన రాజకీయ జీవితాన్ని తానే సమాధి చేసుకున్నారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబును "వాడు, వీడు" అని తిట్టిన కన్నా ఈ రోజున ఆయనకే అమ్ముడుపోవడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. ఏపీలో ఓ యువ ముఖ్యమంత్రి ఉన్నారు. పారదర్శకంగా, అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో దేశం మొత్తానికి వైఎస్‌ జగన్‌ ఆదర్శంగా ఉన్నారు. జాతీయ మీడియా కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  ప్రభుత్వం బాగా పని చేస్తుందని చెబుతోంది. కేంద్రం కూడా వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు భేష్ అంటోంది. ఇంత మంచి పాలన అందిస్తోన్న వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దేవుడు కూడా క్షమించడు కదా. అందుకే..కన్నా పదవి త్వరలోనే పోతుంది. ఆయన ఇక రాజకీయంగా శాశ్వతంగా సెలవు తీసుకోవచ్చు. ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని 'సాయి' నామస్మరణ చేసుకుంటూ , గతస్మృతులు నెమరేసుకుంటూ వాళ్లతో వీళ్లతో పిచ్చపాటి మాట్లాడుకుంటూ కన్నా  టైం పాస్‌ చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది .

- వై. వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్

For All Tech Queries Please Click Here..!
Topics: