ఆ ముగ్గురిని బదిలీ చేయాల్సిందే: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఏజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ రావులను బదిలీ చేయాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం వైఎస్ జగన్ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను కలిసి అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తుందో ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చారు. ఓటర్ల లిస్టును ఎలా తారుమారు చేస్తున్నారో ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. సెప్టెంబర్ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారు. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరింది. మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణలో డబుల్గా నమోదయ్యాయి. ప్రజాధికార సర్వే, రియల్టైమ్ గవర్నమెంట్ పిరియాడ్సిక్ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్ను కూడా క్రియేట్ చేశారు. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులను లింక్ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయాలన్నిటిని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.