TDP vs YSRCP: బూతు పదాలతో దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ 

Wednesday, January 13, 2021 04:30 PM Politics
TDP vs YSRCP: బూతు పదాలతో దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ 

Amaravati, Dec 1: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు (TDP vs YSRCP in Assembly) పేలాయి. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సస్పెండ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఫేక్ సీఎం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, వీళ్లంతా గాలికి వచ్చారని, గాలికే పోతారని మండిపడ్డారు. 

శాసనసభ నియమాలకు విరుద్ధంగా సభను (Andhra Pradesh Assembly Winter Session) ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా...  తమపై వెకిలి కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. వరదలు, పంట నష్టంపై గాలి కబుర్లు చెపుతున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో లక్షా 25 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

తన జీవితంలో తాను ఇంతవరకు జైలుకు పోలేదని చంద్రబాబు (Chandra Babu) అన్నారు. జగన్ గాల్లో తిరుగుతూ గాలి మాటలు చెపుతున్నారని... అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రీమియంలు కట్టకుండా పంటల బీమా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ప్రీమియంలు కట్టకపోతే రైతుకు బీమా డబ్బులు రావని అన్నారు. జగన్ చేతకానితనం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఏ పూనకంలో ఉండి జనాలు ఓటేశారో కానీ... జగన్ సీఎం అయిపోయారని అన్నారు. తన అనుభవమంత వయసు కూడా జగన్ కు లేదని... సొంత బీమా పెడతామని తనకే కబుర్లు చెపుతారా? అని మండిపడ్డారు.

అమరావతిని నాశనం చేస్తున్నారని, మీరు వైజాగ్ లో చేస్తున్నది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా? అని ప్రశ్నించారు. బుల్లెట్ దిగిందా? అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వైయస్సార్ ఇదే విధంగా మాట్లాడితే తాను 'మైండ్ యువర్ టంగ్' అని హెచ్చరించానని చెప్పారు. వైయస్సార్ కు ప్రజల పట్ల భయం ఉందని... కానీ జగన్ కు (AP CM YS Jagan) అది లేదని విమర్శించారు. తాము ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని... ఈరోజు అధికారంలో ఉన్నవారికి రేపు తమలాంటి పరిస్థితే రావచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇంగితజ్ఞానం కోల్పోయారని రవాణా, సమాచార, శాసనసభ వ్యవహారాల మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాటిచెట్టుకూ, పెద్దాయనకూ వయసొచ్చిందంటూ మాట్లాడారు. ‘ఆడూ వీడూ అంటూ సీఎం నీ, మంత్రులనూ చంద్రబాబునాయుడు సంబోధించడంపైన మంత్రి అభ్యంతరం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు బుద్ధీజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

‘‘ఏరా చంద్రబాబుగా అనడానికి మాకెంత సేపు కావాలి? రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపింది చంద్రబాబు కాదా..? రైతులకు పెట్టిన ప్రతి బకాయి మేం కడుతున్నాం. సంస్కారం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటీ..? చంద్రబాబు.. ఆయన కొడుక్కి ఖర్జూర నాయుడు రాజ్యాంగం కావాలేమో..? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

అసెంబ్లీ సమావేశాలంటే టీడీపీ సమావేశాలు కావని గుర్తుంచుకోవాలి. తుపాను వచ్చిన నెలన్నర లోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం,’’ అని పేర్ని నాని వాగ్దాడి చేశారు. రామానాయుడు పేరిచ్చి తాను మాట్లాడతానంటే ఎలా? ‘‘రామానాయుడు పేరిచ్చి.. చంద్రబాబు మాట్లాడతానంటే ఎలా..? తన పేరునే చంద్రబాబు ఇవ్వొచ్చుగా..? కన్నబాబు కాపు కాబట్టి.. కాపు సామాజిక వర్గానికే చెందిన రామానాయుడు పేరు ఇచ్చారు. మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కొ అని చంద్రబాబు అనొచ్చా..?చంద్రబాబు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంటికి పరిమితం అయితే బాగుంటుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు మా సూచనను పరిగణనలోకి తీసుకుంటే ఆయనకే మంచిది,’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.
 
మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి అల్జీమర్స్ జబ్బు ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు పిచ్చి పరాకాష్టకు చేరిందని చెబుతూ, ‘‘ఒరేయ్ చంద్రబాబు, ఒళ్లు దగ్గర పెట్టుకో. సీఎంని ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాం.కుక్కబతుక్కీ చంద్రబాబు బతుక్కీ ఏమైనా తేడా ఉందా? ఖర్జూరనాయుడు పేరు కానీ కిస్మిస్ నాయుడు పేరు కానీ మేం ఎత్తామా? చంద్రబాబుది దిక్కుమాలిన బతుకు. అడుక్కుతినేవాళ్లు మెట్లమీద కూర్చున్నట్టు చంద్రబాబునాయుడు కూర్చున్నాడు.  ప్రజలు చంద్రబాబు బట్టలూడదీసినా బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు,’’ అంటూ తూర్పారపట్టారు.
  
రైతు సమస్యల గురించి మాట్లాడటానికి తాము శాసనసభకు వచ్చామనీ, ప్రతిపక్షాలను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారనీ టీడీపీ సభ్యుడ బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నలలో హౌస్ నడవాలా? అంటూ బుచ్చయ్య ప్రశ్నించారు. దాన్యం ధర కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని అన్నారు. ప్రభుత్వం రైతులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదనీ, విశేషమైన అనుభవం కలిగిన చంద్రబాబును సైతం సభ నుంచి సస్పెండ్ చేశారనీ ఆయన వ్యాఖ్యానించారు. అదికారం శాశ్వతం కాదనీ, 151 మంది ఎంఎల్ఏలు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారనీ, పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే మిన్నకుండిపోయారనీ బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ‘మా నోర్లు మూయించగలరు కానీ ప్రజలను ఆపలేరు కదా, వాళ్ళే మీకు గుణపాఠం చెబుతారు,’ అని ఆయన అన్నారు.

 రాష్ట్రంలో రైతులు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారంటూ టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.  బీఏసీ సమావేశంలో పంటనష్టం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదని అన్నారు. ధరల స్థిరీకరణ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చు ఇన్ పుట్ సబ్సిడీని రూ. 15 వేలకు తగ్గించడం దారుణమని అన్నారు. ‘రైతు భరోసా రైతు దగా’గా మారిందని ఆరోపించారు. పోడియం వద్దకు వెళ్ళి మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ సభ్యుల డిమాండ్ చేశారు.  

 
 

For All Tech Queries Please Click Here..!