ఆ రోజు ఆలా మాట్లాడినందుకు శ్రీవాణికి మంత్రి పదవి..!
విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో యంగ్ మినిస్టర్(31) గా ఆమె గుర్తింపు పొందారు. పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే పుష్పశ్రీవాణిని తెలుగుదేశంపార్టీలో చేర్చుకునేందుకు అనేకమంది అనేకవిధాలుగా ప్రయత్నంచారు. కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో చేరినా శ్రీవాణి మాత్రం పార్టీ మారలేదు. అధికార టీడీపీ ప్రలోభాలకు శ్రీవాణి లొంగకపోవడంతో ఆమె భర్త పరీక్షిత్ రాజును కూడా ఆశ్రయించారు టీడీపీ నేతలు. అనేక ప్రలోభాలకు గురిచేశారు. కానీ శ్రీవాణి మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ పార్టీవీడేది లేదని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురుపాంలో పాదయాత్ర చేసినపుడు బహిరంగ సభలోనూ ఆమె అన్నమాటలు జగన్ మనస్సును హత్తకున్నాయి.
తన కట్టేకాలేంతవరకు జగన్ అన్నతోనే ఉంటానని ఆమె చెప్పారు. తనను టీడీపీలో చేరాలంటూ ఎంతోమంది ఒత్తిడులు తెచ్చినా కుటుంబంలో చీలిక తెచ్చినా దేనికి భయపడలేదు. మాకు జగన్ అన్న ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. జగన్ అన్నకి చెప్తున్నా నా కట్టేకాలేవరకు నీతోనే పయనమంటూ బహిరంగసభలో భావోద్వేగంగా మాట్లాడారు. శ్రీవాణి మాటలు విన్న వైయస్ జగన్ ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని సభలో హామీ ఇచ్చారు. తనచెల్లి పుష్పశ్రీవాణిని గుండెల్లో పెట్టుకుంటానన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు విలువనిచ్చిన జగన్ తన కేబినెట్ లో శ్రీవాణికి అవకాశమిచ్చారు. జగన్ కు విధేయురాలిగా, పార్టీపట్ల క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆమె మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో అతిచిన్న మంత్రిగా కూడా ఛాన్స్ కొట్టేశారు.