BC Sankranthi Sabha: దేశ చరిత్రలో బీసీలకు ఎక్కువ పదవులు మేము ఇచ్చాం : ఏపీ సీఎం వైయస్ జగన్

Friday, February 5, 2021 12:00 PM Politics
BC Sankranthi Sabha: దేశ చరిత్రలో బీసీలకు ఎక్కువ పదవులు మేము ఇచ్చాం : ఏపీ సీఎం వైయస్ జగన్

Vijayawada, Dec 17: బీసీ సంక్రాంతి వేడుకల్లో (BC Sankranthi Sabha) సీఎం జగన్‌ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సభ వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్‌ పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేదిక మీద నుంచి ఏపీ సీఎం మాట్లాడుతూ.. (AP CM YS Jagan Speech Highlights) ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు.  

బీసీలంటే వెనుకబడిన వర్గాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి వెన్నుముకలు అని తెలిపారు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశాం. ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మెనార్టీ వర్గాలకు చెందినవారే. కేబినెట్‌ కూర్పులో  ఎస్సా, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చాం. శాసనసభ స్పీకర్‌ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. 4 రాజ్యసభ సీట్లలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాం.’ అని ఏపీ సీఎం తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తానని అన్నారు.  

నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. రాకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాల ప్రసక్తి లేకుండా అర్హులందరికీ సంక్షేమం అందాలి. ఆ బాధ్యతను మీరందరూ స్వీకరించాలి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. 18 నెలల్లోనే 90శాతానికి పైగా హామీలను నెరవేర్చామని ఏపీ సీఎం తెలిపారు.

టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీలకు చేసిందేమీలేదు. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా బీసీలకు రూ.6140 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. సున్నా వడ్డీ పథకం ద్వారా 7.14 లక్షల బీసీ కుటుంబాలకు లబ్ది. ఈనెల 25న 31లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. 15 రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. కోర్టు అనుమతి రాగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!