New CS Meets AP CM: ఏపీ సీఎంని కలిసిన కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

Saturday, February 13, 2021 04:15 PM Politics
New CS Meets AP CM: ఏపీ సీఎంని కలిసిన కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

Amaravati, Dec 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (New CS Meets AP CM) కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి (CM YS Jagan Mohan Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ (Adityanath Das) బాధ్యతలు స్వీకరిస్తారు.

పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన  వై.శ్రీలక్ష్మి  పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసిన సంగతి విదితమే. 

దాస్ 1987 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆపీసర్..ఇంతకు ముందు ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనేక ప్రాజెక్టులను ప్రారంభంలో తనదైన ముద్రను వేసుకున్నారు. రాయలసీమలో ప్రాజెక్టుల రూపకల్పనలో దాస్ పాత్ర ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు కూడా ఎదుర్కొన్నారు.

ఆయన స్వరాష్ట్రం బీహార్‌.. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి.. 1987వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన ఆదిత్యనాథ్ దాస్... బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(1984-86) చేశారు. గతంలో.. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మున్సిపల్ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు.. అయితే.. సీనియార్టీలో అజయ్‌ సాహ్ని, సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ లాంటివారున్నా.. ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే ప్రభుత్వం మొగ్గచూపారని టాక్. ఆదిత్యనాథ్‌ దాస్.. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

ఏపీ కొత్త సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ బయోడేటా ఏంటి, పురపాలక కార్యదర్శిగా శ్రీలక్ష్మి

ఇప్పటివరకు ఏపీ సీఎస్‌గా విధులు నిర్వరిస్తున్న నీలం సాహ్ని సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన సీఎం జగన్ ఆమెను సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. ఎల్వీ సుబ్రమణ్యం తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు. ఆమె పదవీకాలం ముగిసినప్పటికీ.. కేంద్రానికి విజ్ఞప్తి చేసి రెండుసార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగింపజేసుకున్నారు. కొత్త జిల్లాల కమిటీని కూడా ఆమె సారథ్యంలోనే ఏర్పాటు చేశారు. తాజాగా ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో.. ఆమెను సీఎం జగన్ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు..

For All Tech Queries Please Click Here..!