వైభవంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

Saturday, February 20, 2021 04:00 PM Offbeat
వైభవంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

Hyderabad, Dec 28: తెలంగాణ ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష పెళ్లి (CM KCR Adopted Daughter Marriage) ఘ‌నంగా జ‌రిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్ర‌త్యూష, చ‌ర‌ణ్ రెడ్డిలు ఒక్క‌ట‌య్యారు. ఈ వేడుక‌కు షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ గ‌ణేశ్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌త్యూష‌కు పెళ్లి కానుక‌గా సీఎం స‌తీమ‌ణి శోభ‌మ్మ ప్ర‌త్యూష‌ను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ప్ర‌త్యూష‌కు ప‌ట్టువ‌స్త్రాలు, వ‌జ్రాల నెక్లెస్ బ‌హుక‌రించి ఆశీర్వ‌దించారు. గత అక్టోబర్ నెలలో చరణ్‌రెడ్డి, ప్రత్యూషల నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్ జరిగిన సంగతి తెలిసిందే.

కాగా హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లిదండ్రులు మనస్పర్థలతో విడిపోయారు. తల్లి 2003లో చనిపోయేముందు తన పేర ఉన్న ఆస్తిని కూతురు ప్రత్యూష పేరిట రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరింది. ఆ  తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. 

భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే వత్తాసు పలికారు. ఈ క్రమంలో విషయం అధికారులకు చేరింది. మరణం అంచులకు చేరిన ప్రత్యూషను సవతితల్లి, తండ్రి చెరనుంచి విముక్తి కల్పించి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ఆమె కోరిక మేరకు  నర్సింగ్‌కోర్సును పూర్తి చేయించారు. ప్రత్యూష ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో సోమవారం పెండ్లి జ‌రిగింది. చరణ్‌రెడ్డి విదేశాల్లో విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు


 

For All Tech Queries Please Click Here..!