రాజస్థాన్‌లో మరో కొత్త వైరస్, చనిపోయిన కాకుల్లో హెచ్‌5ఎన్‌8 వైర‌స్

Monday, March 1, 2021 03:00 PM Offbeat
రాజస్థాన్‌లో మరో కొత్త వైరస్, చనిపోయిన కాకుల్లో హెచ్‌5ఎన్‌8 వైర‌స్

Jaipur, January 3: దేశంలో కరోనా, కొత్త రూపాన్ని సంతరించుకున్న కోవిడ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో మరో  కొత్త వైరస్ ప్రజలను వణికిస్తోంది. తాజాగా రాజ‌స్థాన్‌లో కాకుల నుంచి కొత్త వైరస్ వస్తున్నట్లుగా రిపోర్టులు వస్తున్నాయి. రాజ‌స్థాన్‌లో వంద‌ల సంఖ్య‌లో మృత్యువాత ప‌డిన కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu Scare in Rajasthan) ఉన్న‌ట్లు అక్క‌డి ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఝాలవార్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో ఏవియన్ ఫ్లూ కారణంగా పెద్దఎత్తున కాకులు మృత్యువాత (Mysterious Crow Deaths) పడ్డాయి. దీంతో రాజస్థాన్ వన్యప్రాణి సంరక్షణ శాఖ ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు.

రాజ‌స్థాన్‌లోనే కాకుండా ఇటు కేంద్రం కూడా ప‌క్షుల మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ రాష్ట్రాల‌కు అలెర్ట్‌గా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేసింది. రాజ‌స్థాన్‌లోనే కాకుండా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ కాకులు చ‌నిపోయిన‌ట్లు స్థానిక అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కాకులు, ఇతర పక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో దీనిపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించింది. 

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వెలువరించిన కథనం ప్రకారం.. ఝాలవార్‌లో దాదాపు 50 కాకులు మృతి చెందడానికి కారణం బర్డ్ ఫ్లూయేనని (Bird Flu Scare) తేలింది.   మొత్తంగా కోటాలో 47, ఝల‌వ‌ర్‌లో 100, బ‌ర‌న్‌లో 72 కాకులు చ‌నిపోయాయ‌ని (Jhalawar, Kota, Jodhpur and Other Districts) రాజ‌స్థాన్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కుంజీ లాల్ మీనా వెల్లడించారు. కాకుల‌తోపాటు కింగ్‌ఫిష‌ర్ ప‌క్షులు కూడా చ‌నిపోయిన‌ట్లు ప‌లుచోట్ల గుర్తించారు. ఝ‌ల‌వ‌ర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర‌వ్యాప్తంగా అలెర్ట్ ప్ర‌క‌టించిన‌ట్లు మీనా తెలిపారు. శుక్రవారం నాగౌర్ జిల్లాలో 50 నెమళ్లు సహా 100 పక్షులు చనిపోగా.. ఝాలవార్‌లోని పాన్వార్ ప్రాంతంలో 60 కోడిపెట్టలు మృత్యువాత పడ్డాయి. పక్షులు మృత్యువాత పడడానికి గల కారణాలను అన్వేషించేందుకు అధికారులు శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు.

రాజ‌స్థాన్‌లో కాకులు చ‌నిపోయిన ప్రాంతానికి చుట్టుప‌క్క‌ల ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించే ప‌నిలో అక్క‌డి అధికారులు ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లోనూ డేలీ కాలేజ్‌లో 50 కాకులు ఇలాగే మృత్యువాత ప‌డ్డాయి. వాటిలోనూ హెచ్‌5ఎన్‌8 వైర‌స్ ఉన్న‌ట్లు ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పూర్ణిమా గ‌డారియా వెల్ల‌డించారు. దీంతో ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న వారి నుంచి స్వాబ్ న‌మూనాలు సేక‌రిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ఆ చుట్టుప‌క్క‌ల‌ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న వారి వేట‌లో అధికారులు ఉన్నారు. బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కు కూడా సోకుతుంది. ఇది కూడా చాలా ప్ర‌మాద‌క‌రమైన‌దే.

For All Tech Queries Please Click Here..!