లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

Saturday, April 11, 2020 09:51 PM News
లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నామని కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయించామని తెలిపారు. ప్రజల క్షేమం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 30 తరువాత దశలవారీగా లాక్‌ డౌన్‌ను ఎత్తేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. నేడు ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని చెప్పారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పరీక్షలు జరగలేదనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉందన్న కేసీఆర్.

ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ ఎగ్జామ్స్ లేకుండా ఎగువ తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోబాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్.బి.ఐ. అనుసరించాలని తెలిపారు. దీన్నే హెలిక్యాప్టర్ మనీ అంటారని వివరించారు. దీనివల్ల రాష్ట్రాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులు బాటు లభిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 96 మంది కోలుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 393 మంది ఉన్నట్టు కేసీఆర్ వివరించారు. 1654 మంది క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: