ప్రభాస్‌ సాహో సినిమాకి జగన్ భారీ గిఫ్ట్..!

Sunday, August 25, 2019 03:52 PM Entertainment
ప్రభాస్‌ సాహో సినిమాకి జగన్ భారీ గిఫ్ట్..!

దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సాహో. టాలీవుడ్ చరిత్రలో ఇంతటి భారీ బడ్జెట్‌‌తో యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించడం ఇదే తొలిసారి. ఈ సినిమాకి ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఎంత టాక్ ఉన్నప్పటికీ తొలివారం కలెక్షన్లపైనే సినిమా లాభ నష్టాలు ఆధారపడతాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతలకు కోట్లలో నష్టాలు వస్తాయి. అందుకే కీలకమైన తొలివారంలోనే వీలైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా టిక్కెట్ల రేట్ల పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సాహో టిక్కెట్ల రేటు పెంపుపై అనుమతి ఇవ్వాలని యూవీ క్రియేషన్స్ కోరింది. వీరి విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా తొలివారం సాహో సినిమా ప్రదర్శించే థియేటర్లలలో టిక్కెట్ రేటు రెట్టింపు కానుంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలివారంలో టిక్కెట్ రేట్లను పెంచడం కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టిక్కెట్ల రేటును పెంచుకోవడానికి పలుమార్లు అనుమతిని ఇచ్చారు. ప్రభాస్‌కి బాహుబలి టైంలో కూడా అదనపు షోలతో పాటు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. ఇప్పుడు జగన్‌ కూడా సాహో సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు ఇచ్చినట్టు సమాచారం. ఈ పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభం కాగా ప్రేక్షకుల జేబులకు మాత్రం చిల్లుపెట్టడమే. ప్రభాస్ ఇటీవల సాహో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన విషయం మనకి తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: