Women Dupes: తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం, కిలాడీ లేడీ అరెస్ట్
స్వల్ప పెట్టుబడులపై భారీ రాబడి వస్తుందని నమ్మించి మోసం చేసిన కిలాడీని (Woman dupes over 250 crore) పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. తమ యాప్ ఆధారిత టాక్సీ హలో టాక్సీ కంపెనీలో పెట్టుబడులపై భారీగా ఆదాయం వస్తుందంటూ గోవాకు చెందిన ఓ మహిళ (47) నమ్మబలికింది. తద్వారా దక్షిణ గోవా నుంచి 900 మందికి పైగా వ్యక్తులకు (Woman dupes over 900 people of ₹250 crore ) టోకరా ఇచ్చింది. సుమారు 250 కోట్ల రూపాయలు మేర మోసానికి పాల్పడి అక్కడినుంచి తన ముఠాతో సహా ఉడాయించింది. దీంతో లబోదిబోమన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు మహిళను అరెస్ట్ చేశారు.
2019లో నమోదైన పోలీసు ఫిర్యాదు ఆధారంగా ఈ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆమె వ్యాపార భాగస్వాములు, నలుగురు కో డైరెక్టర్లలో ముగ్గురు సరోజ్ మహాపాత్రా, రాజేష్ మహతో, సుందర్ భాటి, హరీష్ భాటి పరారీలో ఉన్నట్టు తెలిపారు. కో డైరెక్టర్లలో ఒకరైన మహతోను ఆగస్టు 23న అరెస్టు చేశామన్నారు. మిగతావారిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
జాయింట్ పోలీస్ కమిషనర్ (ఇఓడబ్ల్యూ) ఓపీ మిశ్రా అందించిన సమాచారం ప్రకారం హలో టాక్సీలో పెట్టుబడులు పెట్టినవారికి మొదట్లో అధిక రాబడిని చూపించి, భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించారు. నెలవారీ పెట్టుబడులపై 200 శాతం దాకా అధిక వడ్డీ ఆశ చూపారు. అంతే ఇబ్బడి బముబ్బడిగా పెట్టుబడులొచ్చాయి. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇదే అదునుగా భావించిన వీరు తరచూ ఆఫీసులను మారుస్తూ చివరికి అక్కడినుంచి ఉడాయించారు.
సంస్థ బ్యాంక్ స్టేట్ మెంట్లను పరిశీలించిన అనంతరం పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశామని మిశ్రా వెల్లడించారు. అలాగే 3.5 కోట్ల విలువైన అరవై కొత్త కార్లను నోయిడాలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.