Selfie Deaths: సెల్ఫీ విషాదం, రెండు రోజుల్లో 11 మంది మృతి

Friday, December 25, 2020 02:00 PM Crime
Selfie Deaths: సెల్ఫీ విషాదం, రెండు రోజుల్లో 11 మంది మృతి

Hyderabad, Nov 16: తెలంగాణలో రెండు రోజుల్లో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సెల్ఫీ సరదాతో (Selfie Deaths) అయిదు మంది ప్రాణాలను (Five persons lost life) కోల్పోగా, వేర్వేరు చోట్ల మరో 6 మంది తీరని లోకాలకు వెళ్లిపోయారు. దివాళీ రోజున నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీలు తీసుకుంటూ నిటిలో మునిగిపోయారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్‌ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్‌ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్‌ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు (nizam sagar project) వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్‌ సుమేర్‌ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌ ఉద్యానవనంలోని చెరువులో (ali sagar project ) సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. బోధన్‌ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్‌ నుంచి మీరజ్‌ బేగం(16), హైదరాబాద్‌ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్‌ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు.

ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్‌ పాయింట్‌ సభ్యుడు నగేష్‌ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్‌ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు.

ఇక ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్‌ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. 16 మంది సరదాగా నదిలోకి దిగగా ప్రవాహం పెరగడంతో నలుగురు ఆ ప్రవాహానికి కొట్టుకుని పోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్‌ వద్ద ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల పరిధిలోని రేజింతల్‌ గ్రామానికి చెందిన ఫకీర్‌ ఇస్మాయిల్‌ కుమారుడు సాజిద్, నాగేందర్‌ కుమారుడు రాకేష్‌ ఈ నెల 13న మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్‌ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్‌ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్‌ (18) మృతదేహం లభించింది.

For All Tech Queries Please Click Here..!