Diwali Tragedy: యాసిడ్ దాడి, సాయం కోసం అరుపులు, 16 గంటలు నరకం అనుభవించి యువతి కన్నుమూత
మహారాష్ట్రలోని నాంధేడ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో యాసిడ్, పెట్రోల్ దాడికి గురైన యువతి 16 గంటల పాటు నరకం అనుభవించి కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని నాంధేడ్ జిల్లాలోని సెల్గాన్ గ్రామానికి చెందిన అవినాష్ ఆర్ రాజురే.. సావిత్ర డి. అన్కుల్కర్లు గత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే శుక్రవారం దీపావళి పండుగ జరుపుకోవటానికి పూనేనుంచి సొంత గ్రామానికి బైకుపై బయలుదేరారు.
మార్గం మధ్యలో నిర్మానుష ప్రాంతంలో వాహానాన్ని నిలిపిన రాజురే సావిత్రపై దాడికి దిగాడు. ప్రతిఘటించిన ఆమె గొంతునులిమి చంపాలని చూశాడు. అయితే ఆ యువతి గట్టిగా ప్రతిఘటించడంతో యాసిడ్ దాడి చేశాడు. భరించలేని నొప్పితో సహాయం కోసం ఆమె అరుస్తూ ఉన్నా దయలేకుండా బైకులోని పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓ గొర్రెల కాపరి కాలిన గాయాలతో అక్కడ మురికి కాలువలో పడి ఉన్న ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 16 గంటల సుధీర్ఘ నరకం తర్వాత అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.