Couple Died: పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో రెండు జంటలు తిరిగిరాని లోకాలకు..

Thursday, January 28, 2021 03:15 PM Crime
Couple Died: పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో రెండు జంటలు తిరిగిరాని లోకాలకు..

Hyderabad, Dec 12: తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ యువజంట రోడ్డు ప్రమాదంలో మృతి (Couple Dies in Road Accident) చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విషాద ఘటన వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్‌ (24), హైదరాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22) గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తల్లి దండ్రులను ఒప్పించేందుకు ముందుగా ఇద్దరూ సతీశ్‌ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బయల్దేరారు

పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించాలని అనుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, సదాశివనగర్‌ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి (love couple dies in Road Accident) గురయ్యారు. సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో జాతీయ రహదారి దాటుతుండగా నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది.  

మోడెగాం గ్రామానికి వెళ్తూ పోలీసుల సాయం కోరేందుకు సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నవదంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సతీశ్‌ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నారు.

పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని యువజంట ఆత్మహత్య
మరో చోట పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని యువజంట ఆత్మహత్య (love Couple dies by suicide) చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో చోటు చేసుకుంది. విషాద ఘటన వివరాల్లోకెళితే..  చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు అంజయ్య కుమారుడు నవీన్‌ (21) ఇంటర్మీడియట్ పూర్తి చేసి గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో కూలి పనిచేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతుంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు ఆరు నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. అయితే పది రోజుల క్రితం వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు.  

దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరూ  గురువారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై గ్రామం నుంచి బయలుదేరి హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మీదుగా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ నుంచి రేపాల గ్రామానికి వెళ్లే రహదారికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ వేపచెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ వెంట తెచ్చుకున్న చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయం వీరిని వెంటాడినట్లుగా తెలుస్తోంది. 

శుక్రవారం తెల్లవారు జామున రహదారిపై వెళ్తున్న కొందరు స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మునగాల ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బైక్‌ నంబర్‌ ఆధారంగా ముందు మృతుడు నవీన్‌ అడ్రస్‌ను గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వీఆర్‌ఓ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

For All Tech Queries Please Click Here..!