అమెరికాలో నలుగురు తెలుగువారు అనుమానాస్పద మృతి
అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్డెస్ మోయిన్స్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల శరీరంలోకి తుపాకీ బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ విషయమై నగర పోలీస్ మాట్లాడుతూ 65 స్ట్రీట్లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) 911కు ఫోన్కాల్ వచ్చింది. దీంతో మా పోలీస్ యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ ఘటనలో చంద్రశేఖర్ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు వారి ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు అని పోలీసులు తెలిపారు.
వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో పోలీసులకు సమాచారం అందించారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని తెలిపారు. పోస్మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని పోలీసులు చెప్పారు. ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు.