భారతి ఎయిర్‌టెల్ దూకుడు,2 బిలియన్ డాలర్లకై వేట

Wednesday, January 15, 2020 03:15 PM Business
భారతి ఎయిర్‌టెల్ దూకుడు,2 బిలియన్ డాలర్లకై వేట

దేశీయ టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్‌ భారీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ)కి సిద్ధమవుతోంది. క్యూఐపి ద్వారా సుమారు 2 బిలియన్ డాలర్లు సేకరించాలని ఎయిర్టెల్‌ యోచిస్తోందన్నవార్తలు మార్కెట్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెట్టుబడుల సమీకరణకు పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు  సమాచారం. ఈ భారీ క్యూఐపీ వచ్చే రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

2 బిలియన్ డాలర్ల వరకు ఈక్విటీని, మరో  బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించే ప్రతిపాదనలకు భారతి ఎయిర్‌టెల్ వాటాదారుల అనుమతి లభించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల ప్రకారం వార్‌బగ్ పిన్‌కస్, ప్రుడెన్షియల్, క్యాపిటల్ ఇంటర్నేషనల్, జీఐసి, సహా టెమాసెక్‌ భారతి ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెమాసెక్, జీఐసీ సంస‍్థనుంచి చెరి 500 మిలియన్ డాలర్లు సమకూర్చుకోనుంది. ఇందుకు వాటాదారుల ఆమోదం లభించిందనీ,  రానున్న  రెండు వారాల్లోనే ఈ  క్యూఐపీ మొదలు కానుందని భావిస్తున్నారు.  అయితే ఈ అంచనాలపై భారతి ఎయిర్‌టెల్‌  అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది.

For All Tech Queries Please Click Here..!