ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఓలా ప్రణాళికలు

Friday, December 18, 2020 12:15 PM Business
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఓలా ప్రణాళికలు

దేశంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఓలా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులను ఆ సంస్థ ముమ్మరం చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక సంవత్సరంలో సుమారు రెండు మిలియన్ యూనిట్లను తయారు చేసేలా ప్లాంట్ ఉండనుందని సమాచారం. ఇందుకు కనీసం 100 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో సౌరశక్తిని ఉపయోగించుకోవాలని ఓలా భావిస్తుంది.

ఇతర సంస్థలకు పోటీ
 ఈ వార్తలను ఓలా సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఓలా ఎలక్ట్రిక్ రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆ సంస్థ అనుకున్నట్లుగానే తయారీ కేంద్రాన్ని నెలకొల్పితే.. మన దేశంలో ఇప్పటికే ఈ స్కూటర్లను తయారు చేస్తున్న బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్- బ్యాక్డ్ అథర్ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్ వంటి సంస్థలు కూడా ఉత్పత్తిని పెంచే యోచనలో ఉన్నాయి. ఈ సంస్థలకు ఓలా గట్టి పోటీదారుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్టు నుంచే ప్రణాళికలు
 అమ్స్టర్‌డామ్‌కు చెందిన ఎటర్గో బివి సంస్థను ఈ ఏడాది మేలో ఓలా ఎలక్ట్రిక్  కొనుగోలు చేసింది. కానీ ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందో వెల్లడించలేదు. ఈ సంవత్సరంలో కొత్తగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని ఓలా ఎలక్ట్రిక్  ఆగస్టులో ప్రకటించింది. మన దేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. ఇందుకు టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా, టాటా సన్స్ వంటి సంస్థల నుంచి  ఓలా ఎలక్ట్రిక్ సుమారు 400 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.


 

For All Tech Queries Please Click Here..!