MSAF New Plant: ఏపీలో రూ.1,200 కోట్లు పెట్టుబడితో కొత్త స్టీల్ ప్లాంట్ 

Tuesday, December 8, 2020 01:00 PM Business
MSAF New Plant: ఏపీలో రూ.1,200 కోట్లు పెట్టుబడితో కొత్త స్టీల్ ప్లాంట్ 

స్టీల్‌ తయారీ రంగంలో  అగ్రగామిగా ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (MSAF) ఏపీలో కొత్తగా రూ.1,200 కోట్లు పెట్టుబడితో అత్యాధునిక స్టీల్‌ ప్లాంటును (MSAF New Plant) నెలకొల్పుతోంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో గల మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది (MSAF New Plant in AP) ఏర్పాటవుతోంది.  ఈ ప్లాంటు ద్వారా దాాదాపు 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్‌ గౌతమ్‌ గనెరివాల్‌ మీడియాకు తెలిపారు. 

ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్ సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.2,100 కోట్లుగా ఉంది. ఈ మధ్య ఎంఎస్‌ఏఎఫ్‌ కొత్తగా ఎంఎస్‌ లైఫ్‌ 600 ప్లస్‌ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు. కొత్తగా రానున్న ప్లాంటుతో వీటి సామర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరనుంది.

కాగా టీఎంటీ బార్స్‌ను హైదరాబాద్‌ సమీపంలోని తూప్రాన్‌ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎంఎస్‌ లైఫ్‌ 600, ఏఎఫ్‌ స్టార్‌ 500–డి పేరుతో స్టీల్‌ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు స్టీల్‌ను సరఫరా చేసింది.

For All Tech Queries Please Click Here..!