నెక్సాన్, బ్రిజాలపై పోటీగా వస్తోన్న హ్యుందా వెన్యు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త వెన్యు కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. హ్యుందాయ్ వెన్యు కాంపాక్ట్ ఎస్యూవీ మీద రూ. 21,000 ప్రారంభ ధరతో బుకింగ్స్ కూడా ప్రారంభించింది, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యుందాయ్ షోరూముల్లో లేదా ఆన్లైన్ ద్వారా మే 20, 2019 వరకు వెన్యు కాంపాక్ట్ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు.
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్యూవీలకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో హ్యుందాయ్ వెన్యు ఎస్యూవీ విడుదలకు ప్లాన్ చేసింది. హ్యుందాయ్ వెన్యు మూడు విభిన్న ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. అవి, 1.4-లీటర్ డీజల్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ పెట్రోల్.
హ్యుందాయ్ ఇండియా విపణిలో విక్రయిస్తోన్న ఎంట్రీ లెవల్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా. కానీ ఇదే సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ కంటే క్రెటా ధర ఎక్కువ. దీంతో క్రెటా ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీగా నిలిచింది. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న బ్రిజా, ఇకోస్పోర్ట్ మరియు నెక్సాన్ వంటి ఎస్యూవీలకు గట్టి పోటినిచ్చేందుకు హ్యుందాయ్ వెన్యు విపణిలోకి అతి త్వరలో రానుంది.