రాష్ట్రంలో నేడూ అదే పరిస్థితి
_(31)-1749750311.jpeg)
ఉత్తర కోస్తాంధ్ర, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శుక్రవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం సాయంత్రం 7 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64.5మిమీ, పల్నాడు జిల్లా మాచర్లలో 61.7మిమీ మరియు కాకాణిలో 55మిమీ, చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54మిమీ, తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో 47.5మి మీ చొప్పున అధిక వర్షపాతం నమోదయిందని తెలిపింది.