నన్ను బలవంతంగా అరెస్టు చేశారు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అరెస్టుపై స్పందిస్తూ.. "ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పా. విచారణకు సహకరిస్తానన్నా బలవంతంగా అరెస్టు చేశారు. FIR లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్లు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తా" అని పేర్కొన్నారు.
లిక్కర్ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ నుంచి ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరు చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్ పోర్ట్ కూడా ఏపీ పోలీసులకు.. కర్ణాటక పోలీసులు అందజేశారు. ఇవాళ ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన డబ్బులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది.



