పార్టీ ఫండ్ ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ బెదిరిస్తూ దొరికిపోయిన టీడీపీ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎలక్షన్ తరవాత బరితెగించారు. ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్ పేరుతో వ్యాపారులు, కాంట్రాక్టర్లను టార్గెట్స్ చేసుకొని మరీ వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసినా కూడా పార్టీ ఫండ్ను మాత్రం వదలట్లేదు. వీలు న్నంత వరకు దోచేదాం అనే ఉద్దేశంతో రెచ్చి పోతున్నారు. వీరి బాధపడలేక విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చేసిన ఓ వ్యాపారి విషయంలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు . ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, ఆయన అధికారిక నివాసం ల్యాండ్లైన్ నుంచే ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోమవారంలోపు తాము అడిగిన రూ.8 కోట్లు చెల్లించకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారు. వీరి ఆగడాలు తట్టుకోలేక సదరు వ్యాపారి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్ ఆంధ్రప్రదేశ్తోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లోనూ మనోహర గ్రీన్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొన్నేళ్లు టీడీపీకి సానుభూతిపరుడిగా పని చేశారు. కొన్ని కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు రవికాంత్ దూరంగా ఉంటున్నారు. గతనెల వరకు ఆయన విషయం పట్టించుకోని టీడీపీ నాయకులు ఎన్నికల నగారా మోగడంతో వసూళ్లపై దృష్టి పెట్టారు. టీడీపీకి చెందిన ఓ మాజీ కేంద్రమంత్రికి సన్నిహితంగా మెలిగే వెంకట్రావు నాయుడు ఈ వ్యాపారిని సంప్రదించారు. వెంకట్రావు నాయుడు గతంలో రవికాంత్తో రూ.10 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు చేశారు. ఇలా రవికాంత్ ఆర్థికస్థితిపై ఓ అంచనాకు వచ్చిన వెంకట్రావు నాయుడు ఆపై అసలు కథ మొదలెట్టారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ (టీడీపీ) కోసం ఫండ్ ఇవ్వాలని కోరారు. తన ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా లేదని ఈసారికి తానేమీ చేయలేనని రవికాంత్ చెప్పారు. ఈమధ్య తానే రూ.10కోట్ల వ్యాపారం ఇచ్చానని, ఇలా ఎందరో ఇచ్చి ఉంటారని మాట్లాడిన వెంకట్రావు డబ్బు ఇవ్వాల్సిందేనని, సీఎం చంద్రబాబు మీకు రూ.8 కోట్ల ఫండ్ టార్గెట్ పెట్టారని చెప్పాడు. ఆ మొత్తం ఇవ్వడం తన వల్ల కాదంటూ వ్యాపారి చెప్పడంతో దొరబాబు, శ్రీనివాస్ అనే మరో ఇద్దరు రంగంలోకి దిగి డబ్బు ఇవ్వకుంటే కుటుంభం మొత్తాన్ని చంపేస్తాం అని బెదిరించారు. ఇది అంతా సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం ల్యాండ్లైన్ నుంచే జరగటం గమనార్హం.