శ్రీరాముడు కల్పితం.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఓ ప్రశ్న వేశారు. 'హిందూ జాతీయవాదం ఆధిపత్యం సాధించిన సమయంలో అన్ని మతాల వారినీ అక్కున చేర్చుకునే లౌకికవాద రాజకీయాలను ఎలా చేయాలి?' అని ప్రశ్నించారు.
దీనికి రాహుల్ సమాధానం చెప్తూ, భారత దేశంలోని సాంఘిక సంస్కర్తలు, రాజకీయ మేధావుల్లో ఎవరూ మత ఛాందసవాదులు కాదన్నారు. బీజేపీ భావజాలాన్ని హిందుత్వంగా తాను పరిగణించనని చెప్పారు. 'అందరూ కాల్పనిక వ్యక్తులు, శ్రీరాముడు అలాంటి వారిలో ఒకరు. ఆయన క్షమిస్తారు. కరుణామయుడు. బీజేపీ భావనను హిందూ భావనగా నేను చూడను. ఆలోచనల్లో వారు చిల్లర వ్యక్తుల బృందం. ఇప్పుడు వాళ్లు రాజకీయ అధికారాన్ని లాక్కున్నారు, వాళ్లు పెద్ద ఎత్తున సంపద, అధికారాన్ని పొందారు' అని రాహుల్ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, హిందువులను, శ్రీరాముడిని కించపరచడం కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా మారిపోయిందని విమర్శించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు, 'హిందూ ఉగ్రవాదం' అనే పదాన్ని సృష్టించిన వారు, ఇప్పుడు శ్రీరాముడు కాల్పనిక వ్యక్తి అని అంటున్నారని మండిపడ్డారు. రామాలయంలో బాల రాముని ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కాలేదని గుర్తు చేశారు. శ్రీరామునిపై, హిందువులపై వారికి గల వ్యతిరేకత దీనిని బట్టి అర్థమవుతుందని తెలిపారు.