బ్రేకింగ్: ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు, పోలవరం నిర్మాణానికి అడ్డపడటం లేదు.. కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని వికారాబాద్ టీఆర్ఎస్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడూ అడ్డం పడలేదని, ఇకముందు కూడా అడ్డం పాడమని కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో మాకెటువంటి గొడవ లేదు అని చెప్పారు. తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీ తన మేలుతో పాటు ఇతరుల మేలు కూడా కోరుకుంటుంది అని అన్నారు. చంద్రబాబు లాగా చీకటి పనులు చేయం. నీ లాగా పొద్దున్నే లేచి మందికి గోతులు తీయం. తెలంగాణ ప్రజలకు కుట్రలు చేయడం రాదు. లోక్సభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 సీట్లు. ఎంఐఎం 1 సీటు గెలవబోతున్నది. ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.
చంద్రబాబులాగా మాది నీచబుద్ధి కాదు. మాకు ఉదార స్వభావం ఉంది. మీకు పోలవరం కట్టడం రాలేదు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా మాత్రమే అడుగుతున్నాం. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. అందరూ బతకాలన్నదే మా సిద్ధాంతం. దేశాన్ని విడదీసి ఏం సాధిస్తారని కేసీఆర్ వివరించారు.