సీఎం చంద్రబాబుకు కవిత లేఖ
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయితీలు అయిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం రాముల వారి గుడి మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. రాములవారు తెలంగాణలో ఉంటే ఆయన మన్యం భూములు ఏపీలో ఉండటంతో ఆ భూముల్లో ఇష్టారాజ్యంగా కబ్జాలు కొనసాగుతున్నాయని వివరించారు. కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భద్రాచలం రామాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి పై కబ్జాదారులు దాడి చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వెల్లడించారు. రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారని, అదే రాములవారు కొలువై ఉన్న భద్రాచలం పట్టణాన్ని పోలవరంలో ముంచేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.



