అందుకే వారు అమ్ముడుపోయారు : వైసిపి నేత
ఏజెన్సీలోని బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు అనుకూలంగా ఉంటుందనే వైసీపీ ఎమ్మెల్యేలైన గిడ్డిఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక వైసీపీ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక వుడా ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన వైసీపీ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, వైసీపీ ఓట్లతో గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత సైతం పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. వీరు వ్యక్తిగత స్వార్థంతోనే వైసీపీని వీడారన్నారు. ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా, అరకులోయను సీఎం చంద్రబాబు, లంబసింగిని మంత్రి గంటా శ్రీనివాసరావు దత్తత తీసుకున్నా.. గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీ అధికారంలో వస్తుందని, అందుకు పార్టీ శ్రేణులు రానున్న మూడు నెలలు కష్టించి పనిచేయాలన్నారు.