అర్థరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు.. నెలకొన్న యుద్ధ వాతావరణం

ఊహించినట్టే భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ పొడవునా ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
ఏప్రిల్ 25-26 తేదీల రాత్రి వేళ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఎటువంటి కవ్వింపు లేకుండా తేలికపాటి కాల్పులు జరిపాయని ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో సరిహద్దు భద్రత దళాలు తక్షణమే ఎదురుదాడికి దిగాయని, ఈ కాల్పులను తిప్పి కొట్టాయని తెలిపారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
అటు పాకిస్తాన్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో మిస్సైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులను కూడా పరీక్షించింది. కరాచీ తీర ప్రాంతంలో మిస్సైల్ టెస్టులను చేపట్టింది. రెండు రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రకటించింది. తీరాన్ని పంచుకుంటోన్నందున భారత్కూ ఈ సమాచారాన్ని అందించింది. దీనికి తగ్గ నౌకాదళ సిబ్బంది, సైన్యాన్ని మోహరింపజేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా నియంత్రణ రేఖ పొడువనా ఉన్న భారత్ అవుట్ పోస్టులపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాల్పులు ఏ ఒక్క సెక్టార్కో పరిమితం కాలేదు. ఎల్ఓసీ పొడవునా కొనసాగాయి.