ఒకే రాష్ట్రంలో 5 వేల మంది పాకిస్తానీయులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. వీళ్లలో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్లకి సూచించినట్లు తెలిపారు.
"రాష్ట్రంలోకి దీర్ఘకాలిక వీసా మీద వచ్చినవారు 4 వేల మంది వరకు ఉంటారని నా అంచనా. సార్క్ వీసా మీద మరో వెయ్యి మంది ఉంటారు. వీళ్లలో సినిమాలు, వైద్యం, జర్నలిజం, వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చారు. పాకిస్థానీయుల్లో కొందరు 8 నుంచి 10 ఏళ్లుగా భారత్లోనే ఉంటున్నారు. కొందరు పెళ్లి చేసుకోగా మరికొందరు పాకిస్థాన్ పాస్పోర్టును సరెండర్ చేశారు. ఆ తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్వల్పకాలిక వీసాల మీద వచ్చిన వాళ్లు ఏప్రిల్ 27లోగా వెళ్లిపోవాలని సూచించాం. వైద్యం కోసం వచ్చిన వాళ్లకి మాత్రం మరో రెండ్రోజుల వరకు గడువు ఉంటుందని'' యోగేశ్ కదమ్ అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని పాక్ పౌరులు స్వదేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే ఆదేశించింది. అలాగే అట్టారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.