అమెరికా కోసమే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాం: పాకిస్తాన్
_(15)-1745580368.jpeg)
తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్కు గట్టి షాక్ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలు విషయాలను బయటపెట్టాయి.
అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ వ్యాఖ్యలు చేశారు. ''ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలాకాలంగా చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటీ?'' అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఖవాజా బదులిస్తూ.. ''అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేది'' అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని అన్నారు. మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ తన బలగాలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ సరిహద్దులతో పాటు బలోచిస్థాన్లో ఉన్న మిలిటరీ సిబ్బందిని నియంత్రణ రేఖ వద్దకు పంపిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అటు జవాన్ల సెలవులను కూడా పాక్ మిలిటరీ రద్దు చేసినట్లు సమాచారం. కొత్త సెలవులను ఆమోదించొద్దని కార్ప్స్ కమాండర్లను ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.