ఏపీలో దారుణ పరిస్థితి.. ఉద్యోగుల జీతాలు కూడా కష్టమే!

Saturday, April 20, 2019 09:53 AM News
ఏపీలో దారుణ పరిస్థితి.. ఉద్యోగుల జీతాలు కూడా కష్టమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారుఅయ్యింది ఓవైపు తక్కువ ఆదాయం, మరోవైపు చెప్పలేనన్ని సంక్షేమ పథకాలు అన్ని ఏపీ ఖజానాపై భారాన్ని మరింత పెంచాయి. ఆదాయ పరిమితి గురించి ఆలోచన లేకుండా అధికార పార్టీ అమలుచేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టాయి. రాబోయే నాలుగైదు నెలల తర్వాత ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడానికి సరిపోయేంత డబ్బు ఖజానాలో ఉండకపోవచ్చు అంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అమలుచేసిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ వంటి పథకాలు ఖజానాపై అదనపు భారం మోపడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు.

సాధారణంగా ప్రతీ నెలా రూ.12వేల కోట్లు ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు రూ.4వేల కోట్లు దాకా ఖర్చవుతోంది. మిగతా డబ్బును ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. కానీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఖజానాపై భారీ భారం పెరగడంతో ఉద్యోగుల జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. దీంతో అప్పు కోసం మరోసారి ఆర్‌బీఐని సంప్రదించగా అక్కడి నుంచి ప్రతికూల సమాధానమే ఎదురైంది. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఇప్పటికే ఒకసారి అప్పు తీసుకుని ఇప్పుడు మళ్లీ అప్పు కోసం అభ్యర్థించడంపై ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదాయం పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తూ పోవడం ఖజానాపై భారాన్ని పెంచుతోంది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కచ్చితంగా రాష్ట్ర ఆదాయం పెరగాల్సిందే. అయితే సంక్షేమ-అభివృద్ది పథకాల గురించి హామీలిచ్చే పార్టీలు ఆదాయాన్ని పెంచే మార్గాలపై మాత్రం దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

For All Tech Queries Please Click Here..!