గుజరాత్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. అందులో 242 మంది..
-1749721707.jpeg)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానంగా కూలిపోయింది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు.