పేట్రేగిన ఉగ్రవాదులు.. మతం పేరు అడిగి తుపాకీతో కాల్చేశారు..

Wednesday, April 23, 2025 07:39 AM Crime
పేట్రేగిన ఉగ్రవాదులు.. మతం పేరు అడిగి తుపాకీతో కాల్చేశారు..

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగి పోయారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో పర్యాటకులను ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.

మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీశ్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ సైతం ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్ కు చేరుకున్నారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, ఒడిశా వాసులు ఉన్నారు. ఉగ్రదాడి ఘటనతో సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రధాని పుతిన్ తీవ్రంగా ఖండించారు.

ఈ ఉగ్రదాడి తమ పనేనని 'ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)' ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి టీఆర్‌ఎఫ్‌ గా ఉద్భవించింది. జమ్మూకశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది. లష్కరేకు చెందిన సాజిద్‌ జట్‌, సజ్జద్‌ గుల్‌, సలీం రెహ్మానీ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో కేంద్ర హోం శాఖ ఈ సంస్థపై నిషేధం విధించింది. ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టి కనికరం లేకుండా కాల్పులు జరిపారు. హనీమూన్ కోసం వెళ్లిన నూతన జంటలో ఉగ్రదాడి విషాదాన్ని నింపింది. హనీమూన్ కోసం కశ్మీరు వెళ్లి ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన యువతి ఆ షాక్ నుంచి తేరుకున్న తరువాత ఘటన గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. ''నా భర్తను నాముందే చంపేశారు.. నేను, నా భర్త బేల్ పూరీ తింటున్నాం. తుపాకీ పట్టుకున్న ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి.. మీది ఏ మతం అని అడిగాడు. హిందువు అని చెప్పడంతో నా భర్త తలపై తుపాకీ పెట్టి వద్దని వేడుకుంటున్నా కాల్పేశాడు అంటూ యువతి కన్నీరు మున్నీరైంది. మరోవైపు ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: