కాళ్ళు చేతులు కట్టేసి.. కారం చల్లి.. ఆపై నూనె పోసి.. తల్లీ కూతుళ్ల కిరాతకం

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓంప్రకాష్ను ఆయన భార్య పల్లవి కూతురితో కలిసి దారుణంగా చంపేసింది. కళ్లల్లో కారం కొట్టి, కాళ్లుచేతులు కట్టేసి తర్వాత పొడిచి చంపేసింది. ఓంప్రకాష్ ఛాతి, పొట్టభాగాలపై పలు కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. భర్తపై పల్లవి గాజు సీసాతో కూడా దాడి చేసి దారుణంగా చంపిందని పోలీసులు చెప్పారు. హత్య చేసిన విషయాన్ని మాజీ డీజపీ భార్య పల్లవి మరో పోలీస్ అధికారి భార్యకు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. దాడి జరుగుతున్నవేళ కూతురు కృతి కూడా అక్కడే ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మాజీ డీజీపీ హత్యకు దారి తీసింది ఆస్తివివాదమని, ఓంప్రకాష్ ఆస్తిని బంధువుకు రాసిచ్చారని, దీంతో ఈ అంశంపైనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాతే భర్తను పల్లవి స్కెచ్ వేసి చంపినట్లు అంటున్నారు. అయితే ఓంప్రకాష్ కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఓంప్రకాష్ హత్యపై తల్లీకూతుళ్ల వాంగ్మూలం తీసుకున్నారు. వారంరోజుల నుంచి తనను చంపేస్తానంటూ ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారని పల్లవి చెప్పింది. ఇదే విషయమై నిన్న ఉదయం నుంచి ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే తనను, తన బిడ్డను చంపడానికి ఓంప్రకాష్ ప్రయత్నించారని, కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్యచేశామని కూతురు కృతి చెబుతుంది. తన తండ్రి కాళ్లుచేతులు కట్టేసి కారంచల్లి, వంటనూనె పోశామని ఒప్పుకుంది. ఈ హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.