ఆశ్రమ పాఠశాలలో గర్భందాల్చిన బాలికలు.. మందు, సిగరెట్లతో దారుణం!

ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల దారుణ ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. మీర్జాపూర్ జిల్లాలోని మదిహాన్ తహసీల్ పరిధిలో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నీలం ప్రభాత్ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థినుల నుంచి ఎదురైన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. ఆమె ఆదేశాల మేరకు ముగ్గురు అధికారుల దర్యాప్తు బృందం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.
విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో కొందరు బాలికలు గర్భవతులు కావడం, వారికి గర్భధారణ పరీక్షలు నిర్వహించడం జరిగినట్లు సమాచారం. విద్యార్థినుల శానిటరీ ప్యాడ్ లను కూడా స్కూల్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు గుట్కా తింటూ, సిగరెట్ తాగుతూ విద్యార్థినులపై పొగ ఊదేవాడని ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయినులు మద్యం సేవిస్తూ క్లాస్ రూమ్లలోనే నిద్రించేవారని తేలింది. విద్యార్థినులపై వారి చూపిస్తున్న నిర్లక్ష్యం, అసభ్య ప్రవర్తన, శిక్షణలో లోపాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల ఫిర్యాదులతో కూడిన నివేదికను దర్యాప్తు బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పంపించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత, హక్కులు అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలని వారు కోరుతున్నారు.