Oppo India: హైదరాబాద్‌లో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌  

Technology Published On : Friday, February 12, 2021 02:15 PM

 ఒప్పో  ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (5G innovation lab) ఏర్పాటు చేస్తోంది. చైనా తరువాత భారతదేశంలోని​ హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ (5G innovation lab in in Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. నూతన ఆవిష్కరణలతోపాటు,  భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా (innovation Hub) మార్చేలక్ష్యంలో​ భాగంగా మరో మూడు ఫంక్షనల్‌  ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ (Oppo India) యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్‌ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో  తమ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌  కేంద్రంలో 5జీ ఇన్నేవేషన్‌ ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నామనీ, విదేశాల్లో ఇది మొదటిదని ఒప్పో తెలిపింది. అలాగే అత్యాధునిక ఆవిష్కరణ పనుల కోసం కెమెరా, పవర్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చేలా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని  పేర్కొంది. తద్వారా 5 జీ యుగానికి కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి,  మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి  చేస్తున్నామని తెలిపింది. 

ముఖ్యంగా ఇండియా 5జీ ప్రయాణంలో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తస్లీమ్ ఆరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఒప్పో ల్యాబ్‌లు ప్రపంచానికి సరికొత్త మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను రూపొందించడంపై దృష్టి సారించనున్నాయి. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్ సహా ఇతర దేశాల కోసం భారత్ కూడా నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని ఒప్పో తెలిపింది.

సెప్టెంబర్ 2020 నాటికి, ఒప్పో 3GPP కి 3,000 5G ప్రామాణిక-సంబంధిత ప్రతిపాదనలను సమర్పించింది, 5G ప్రామాణిక పేటెంట్ల యొక్క 1,000 కుటుంబాలను ఫ్రాన్స్ ఆధారిత సాంకేతిక ప్రామాణిక సంస్థ యూరోపియన్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ కు ప్రకటించింది.