టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Politics Published On : Thursday, June 6, 2019 09:00 AM

వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో వైవీ నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున ముందుండి నడిపారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు. అయితే గోదావరి జిల్లాల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. వైఎస్సార్‌సీపీలో ప్రారంభం నుంచీ సుబ్బారెడ్డి క్రియాశీలంగా ఉన్నారు.