ముఖ్యమంత్రి జగన్ భద్రత మరీ ఇలాగా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని వందేమాతరం హైస్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు జగన్. సీఎం కాన్వాయ్ పెనుమాక నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా తాడేపల్లి వైపుకు వస్తున్న సమయంలో ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లే వాహనాలను ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు వదిలేశారు. దీంతో అతి తక్కువ సమయంలో పదుల సంఖ్యలో వాహనాలు సీఎం కాన్వాయ్లో కలిసిపోయాయి. ఇలా, సీఎం ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం ఆయన భద్రతకు ముప్పని పోలీస్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.