అవినీతి ఆరోపణలతో ఆంధ్ర రాష్ట్రానికి తీరని నష్టం అంటున్న టీడీపీ ..!

Politics Published On : Monday, June 24, 2019 04:27 PM

పోలవరం, అమరావతి నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోపాటు వైసిపి నేతలు చేస్తున్న అవాస్తవ ఆరోపణలు అని టిడిపి సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు. వాటి వల్ల  రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిలుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో ఆదివారం ఉదయం టిడిపి ముఖ్య నేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా నేతలు తాజా రాజకీయ పరిణామాలు, వైసిపి చేస్తున్న అవినీతి ఆరోపణల గురించి చంద్రబాబుకి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేక పోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్నారు. అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టిడిపికి అంటించాలని చూసినా అది వారికే అంటుకుంటుందన్నారు. టిడిఎల్‌పి ఉపనేత కె.అచ్చెన్నాయుడు వైసిపి నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ అక్కడేదో కొండ ఉంది. తవ్వుతానంటున్నావు తవ్వితే ఎలుక కాదు కదా చీమ, దోమను కూడా పట్టుకోలేవు అంటూ వ్యాఖ్యానించారు. గతంలో జగన్‌ అవినీతిని విమర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి వాళ్లుతామేదో మంచివాళ్లము అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ అవినీతి, వైఎస్‌ అలవాట్ల గురించి ఇదే బొత్స సత్యనారాయణ గతంలో ఏమన్నారో అందరికీ గుర్తుందని అచ్చెన్నాయుడు అన్నారు.