అభివృద్దిని తట్టుకోలేకపోతున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలపై ఆగని దాడులు..!

Politics Published On : Wednesday, October 9, 2019 03:14 PM

శ్రీకాకుళం జిల్లా మాతల గ్రామం లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి రంగులు వేస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ కుమారుడు సాగర్ అనుచరులతో కలిసి కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో రాజశేఖర్, నాగరాజు అనే ఇద్దరు గ్రామ వాలంటీర్లతో పాటు వైసీపీ కార్యకర్తలైన శ్రీరాములు, తిరుపతి గాయపడ్డారని సమాచారం. దాడిలో గాయపడినవారిని కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాగర్ గ్రామ సచివాలయానికి ఎటువంటి రంగులు వెయ్యరాదని పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు ఎవరూ ఉండకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులను కూడా బెదిరించారు. కత్తులు, కర్రలతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు బెదిరించి అక్కడ ఉన్న ఉద్యోగులను పంపించివేశారని తెలుస్తోంది.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన నలుగురు కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉండటంతో సాగర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఘటనల్లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోచోట నలుగురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్త షేక్ బాజీపై పదిమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాజీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.