మీరు మా వైపు వస్తారనుకున్నా అన్నా... రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
రోజాని కలవడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అసెంబ్లీ లాబీలోకి చేరుకున్నారు. వారంతా రోజాతో సెల్ఫీలు, ఫొటోస్ దిగటానికి వచ్చారు. దీంతో లాబీలో రద్దీ ఏర్పడింది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అటుగా వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో రోజా వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావటం సెల్ఫీలు దిగటం బాలయ్య చూస్తూ ఉన్నారు. ముందుకు వెళ్లేందుకు దారి లేక వేచి ఉన్న బాలయ్యను అక్కడే ఉన్న మార్షల్స్ రోజా వద్ద ఉన్న కార్యకర్తలను పక్కకు జరిపి బాలయ్యకు దారి ఏర్పాటు చేసారు. ఆ సమయంలో రోజా బాలకృష్ణను బాగున్నారా అని పలకరించారు. బాలయ్య సైతం నవ్వుతూ ఫైన్ అని చెబుతూ వెళ్లిపోయారు.
అదే సమయంలో టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం అటుగా వచ్చారు. ఆయన్ను చూసిన రోజా "మీరు మా వైపు వస్తారని భావించాం అన్నా..కానీ, అటు నుండి వచ్చారు అన్నారు". దీనికి స్పందగా బలరాం నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. గొట్టిపాటి రవి వైసీపీ నుండి టీడీపీలో చేరిన సమయం నుండి కరణం బలరాం అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా సంతృప్తి చెందని బలరాం ఆయన తనయుడితో సహా వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరటంతో, టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ప్లాన్ తో ఆ స్థానంలో కరణం బలరాంను దించారు. తాజా ఎన్నికల్లో కరణం బలరాం చీరాల నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.