గుండెపోటు సతీమణి సమాధి వద్ద కుప్పకూలిన పల్లె రఘునాథ్ రెడ్డి
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి ఇంట్లో ఏకాంతంగా ఉన్న ఆయన రాత్రి 9 గంటలకు అనంతపురం రూరల్ పరిధిలో ఉన్న తన సతీమణి ఉమా సమాధి వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన నివాళులర్పించి కొబ్బరికాయ కొట్టి కాసేపు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పల్లె ఉమాను తలచుకొని కన్నీరు పెట్టారు. ఈ క్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఒక్కసారిగా బోరున విలపించారు. అలా విలపిస్తూ ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు.
అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, కారు డ్రైవర్ పల్లె రఘునాథ్ రెడ్డిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లె రఘునాథ్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. 24 గంటల పర్యవేక్షణ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి చెబుతామని డాక్టర్లు తెలిపారు. దాంతో టీడీపీ కార్యకర్తలో ఆందోళన నెలకొంది. పుట్టపుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు పల్లె రఘునాథ్. కాగా, గురువారం ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆయన అస్వస్థత పాలవడం తెలుగుదేశం శ్రేణులను కలవరపెడుతోంది.