జగన్ మరో నిర్ణయం, ఆరోగ్యశ్రీలో సంస్కరణలకు కమిటీ వేస్తూ ఉత్వర్వులు జారీ..!

Politics Published On : Friday, June 14, 2019 12:00 PM

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా ఆరోగ్య శాఖలో భారీ సంస్కరణలకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు ఓ కమిటీని నియమించింది. పథకాన్ని బలోపేతం చేసేందుకు, ప్రతి ఒక్కరికి అందేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న అంశాలపై నిర్ణీత గడువు లోపు నివేదిక ఇచ్చేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోయడానికి ఈ కమిటీ పనిచేయనుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం, దేశంలోనే అత్యంత గొప్ప పథకంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు అమలు చేసాయి కూడా, తర్వాత ప్రభుత్వాలు ఆ పథకంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించాయి. ఇప్పుడు ఈ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయించింది. పథకం రూపకర్త, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరునే ఈ పథకానికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా పెట్టారు. గతంలో ఉన్న ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ పేరు మార్చి ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌’గా నామకరణం చేశారు.