దొనకొండలో ఢిఫెన్స్ క్లస్టర్, జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Politics Published On : Thursday, February 6, 2020 02:00 PM

Donkonda, Febuary 06: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అందుకోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గట్టి పట్టదలతో ఉన్న విషయం విదితమే. అయితే తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను (Defence Cluster In Donakonda) ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (IT Minister Mekapati Goutham Reddy) తెలిపారు. 

లక్నోలో (Lucknow) జరగుతున్న ఫ్రెంచ్‌-ఇండో డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 (DEFEXPO India 2020) కార్యక్రమానికి ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. 

ఆయన మాట్లాడుతూ.. దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొందని పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా (Make In India) ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి  పంపిందని తెలిపారు.  డిఫెన్స్‌ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్‌ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పాలనలో దొనకొండ రాజధాని చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిఫెన్స్‌ క్లస్టర్ ఏర్పాటుకు, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమలకు కీలక ప్రాంతంగా ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి  స్కిల్‌ డెవలప్‌మెంట్‌‌, ట్రైనింగ్‌శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. ఇటీవలే మంత్రి గౌతమ్‌రెడ్డికి ప్రభుత్వం ఈ రెండు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే