జగన్‌తో నాగార్జున భేటీ : గుంటూరు నుంచి పోటీ?

Politics Published On : Tuesday, February 19, 2019 04:52 PM

ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారతున్నాయి. ఓవైపు టీడీపీ నుంచి వలసలు.. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్‌తో ప్రముఖుల భేటీలు.. ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చేశాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్‌ను కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున.. వైసీపీ అధినేత జగన్‌ను కలవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున.. భేటీ అయ్యారు. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీ తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని, వైసీపీలో చేరతారని, 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

జగన్‌తో నాగ్ భేటీ తర్వాత మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నాగార్జున తన దగ్గరి స్నేహితుడి సీటు విషయమై జగన్‌తో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. అలాగే వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఓ పారిశ్రామికవేత్త సీటు విషయంలోనూ జగన్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వైసీపీలోకి నాగార్జున కుటుంబసభ్యులు ఎవరైనా వెళతారా లేక నేరుగా నాగార్జున స్వయంగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. తన స్నేహితుడికి గుంటూరు ఎంపీ టికెట్ లేదా గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం సీటు ఇప్పించే విషయమై మాట్లాడేందుకు జగన్‌ను నాగ్ కలిశారనే ప్రచారం జరుగుతోంది.

కొంతకాలంగా వైసీపీతో, జగన్‌తో నాగ్ సన్నిహితంగా ఉంటున్నారు. తన మిత్రుడికి గుంటూరు టికెట్ ఇవ్వాలని ఏడాది నుంచి జగన్‌ను కోరుతున్నారని సమాచారం. జగన్ లండన్ టూర్‌కు వెళుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో త్వరగా తమ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో జగన్ ఉన్నారు. ఈ క్రమంలో నాగ్ కూడా తన ప్రయత్నాలను మమ్మరం చేశారట. గుంటూరు ఎంపీ సీటుకి సంబంధించి ఉత్సాహం చూపిస్తున్న నాగార్జున... తన స్నేహితుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది.