క్రైస్తవుడినని చెప్పుకునే జగన్ తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పిస్తారు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Politics Published On : Friday, October 4, 2019 11:00 AM

క్రైస్తవుడినని చెప్పుకునే సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పించారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతుడా అని నిలదీశారు. అధికారుల ప్రవర్తనపై చంద్రబాబు మండిపడ్డారు. ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని అబ్దుల్‌ కలాం కూడా డిక్లరేషన్‌ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేసిన తితిదే అధికారి ధర్మారెడ్డి ఇప్పుడు మాటమార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గమనించాలన్నారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అధికారులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న చంద్రబాబు, శాంతిభద్రతల కోసం గతంలో టీడీపీ నేతలనే జైలుకు పంపామన్నారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకెళ్లాలన్నారు.