వైపాకా, టీడీపీపై సంచలన ప్రకటన చేసిన అసదుద్దీన్ ఓవైసీ

Politics Published On : Sunday, March 3, 2019 07:00 AM

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రాలో తెలుగు దేశం మరియు వైఎస్సార్సీపీ పార్టీలను ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హెచ్చరికలు పంపారు. ‘చంద్రబాబూ... కాచుకో.. నేను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా.. ఎన్నికల్లో జగన్ కు ప్రచారం చేస్తా’ అని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు, ఏపీలో వైసీపీకి ఎమ్ఐఎమ్ పార్టీ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతకుముందు మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడిలో భారత ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మాహుతి దాడులు, బాంబు దాడులను ఇస్లాం అంగీకరించదని తేల్చిచెప్పారు.