రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే..!

News Published On : Wednesday, April 1, 2020 11:01 AM

కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల పలు దేశాలలో అస్థిరత, అశాంతి, ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మాంద్యం ఇదే తొలిసారి అని అయన అన్నారు. కోవిడ్ మహమ్మారిపై పోరును ప్రపంచ దేశాలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పరమైన పంతాలకు ఇది సమయం కాదని, వాటిని ఇప్పుడు పక్కన పెట్టి ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

అలా జరిగితే తప్ప ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని ఆపడం సాధ్యం కాదన్నారు. ఇది కేవలం ఆరోగ్య రంగాన్నీ మాత్రమే కాకుండా మానవ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఇదే తొలిసారని అన్నారు. కరోనాపై పోరులో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్ని బేఖాతరు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో వెనుకబడిన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలబడాలని, అవసరమైన సాయం చేయాలని గుటెరస్ కోరారు.