సమ్మె విరమించిన డీలర్లు
తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మెను రేషన్ డీలర్లు విరమించుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఆదివారం విజయవాడలో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గౌరవ వేతనం మినహా మిగిలిన అన్ని డిమాండ్లపైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. డీలర్లకు గౌరవ వేతనం ఇచ్చే విధానం దేశంలో ఎక్కడా లేదని, అది సాధ్యంకాదని డీలర్లకు తేల్చిచెప్పారు. మెరుగైన విధానాలేవైనా ఉంటే అధ్యయనం చేస్తామన్నారు. డీలర్లకు రావాల్సిన అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు. ఆహార భద్రత చట్టం అమలు, కమీషన్ పెంపునకు మధ్య ఉన్న 10 నెలలకు కూడా రూ.70 చొప్పున కమీషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.