2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు

News Published On : Thursday, November 28, 2019 02:14 PM

రజినీకాంత్ (Rajinikanth)ఈ మధ్య రాజకీయాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న బీజేపీ మీద విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోమారు రాజకీయాలపై తన మనసులోని మాటను బయటపెట్టారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని(miracle and wonder will happen in 2021) రజినీకాంత్‌ వ్యాఖ్యానించారు.

కాగా తాను రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడు(Tamil Nadu)లో 2021లో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తానని రజినీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కమల్‌తో పొత్తుపెట్టుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలోనే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీఎం ఎవరు అవుతారు అన్న మరో ప్రశ్నకు 2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని చెప్పారు.

అప్పటివరకు ఈ విషయంపై వ్యాఖ్యానించబోనని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అవసరమైతే తమిళ ప్రజల సంక్షేమం కోసం తలైవార్‌తో పొత్తుకు సిద్ధమని మక్కల్‌ నీధి మయం పార్టీ (Makkal Needhi Maiam Party) అధినేత కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఇటీవల పేర్కొన్నారు. దీనికి రజినీకూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రజినీకాంత్‌పై ఇప్పటికే అన్నాడీఎంకే (AIADMK) విమర్శలకు దిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతం చేస్తారంటూ ప్రముఖ నటుడు రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి (Chief minister Edappadi K Palaniswami) కౌంటర్ ఇచ్చారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఈ విషయం రజినీకాంత్ కూడా అర్థమైనట్లుంది. అందుకే 2021 ఎన్నికల్లో ప్రజలు అద్భుతం చేస్తారంటూ రజినీ వ్యాఖ్యానించారు’ అని అన్నారు.

వామపక్షభావజాలం కలిగిన కమల్‌హాసన్‌ పార్టీ.. ఆధ్యాత్మిక చింతన ఉన్న రజినీకాంత్‌ పెట్టబోయే పార్టీ పెట్టుకొనే పొత్తు ఎక్కువ కాలం నిలబడదని అన్నాడీఎంకే అధికారిక పత్రిక ‘నమతు అమ్మ’లో ఓ కథనం ప్రచురించారు.