3 భాగాలుగా ఓబీసీ కోటా? రోహిణి కమిషన్ ప్రతిపాదించే అవకాశం.
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఎంత లబ్ధి జరుగుతుంది అన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ కలిపి 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది.
తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, సంపాదన స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తానూ జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు.